‘న్యాయవ్యవస్థలో అవినీతి’ వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీం
ABN , Publish Date - May 23 , 2026 | 04:03 AM
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి వివాదాస్పద అధ్యాయాన్ని రూపొందించడంలో పాలుపంచుకున్న...
న్యూఢిల్లీ, మే 22: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి వివాదాస్పద అధ్యాయాన్ని రూపొందించడంలో పాలుపంచుకున్న ముగ్గురు విద్యావేత్తలపై గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన అకడమిక్ ప్రాజెక్టుల్లో వారు పాల్గొనకుండా మార్చి 11న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అలాగే ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారంటూ ఆ ఉత్తర్వులో కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కూడా తొలగించింది. తమపై విధించిన నిషేధాన్ని తొలగించాలంటూ విద్యావేత్తలు మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం శుక్రవారం విచారించింది. పాఠ్య పుస్తకంలోని ఆ అధ్యాయం పూర్తిగా అవాంఛనీయమైనదని పేర్కొన్న కోర్టు.. ఆ కంటెంట్ను ఏ దురుద్దేశం లేకుండా కలిసికట్టుగానే రూపొందించామన్న విద్యావేత్తల వాదనలను పరిగణనలోకి తీసుకుంది.