పని మనుషులకు చట్టబద్ధత కల్పించలేం: సుప్రీం
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:21 AM
పని మనుషులకు కనీస భత్యం కల్పించేలా సమగ్ర చట్టం తీసుకు రావాలంటూ దాఖలైన పిల్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
న్యూఢిల్లీ, జనవరి 29: పని మనుషులకు కనీస భత్యం కల్పించేలా సమగ్ర చట్టం తీసుకు రావాలంటూ దాఖలైన పిల్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని స్పష్టం చేసింది. ట్రేడ్ యూనియన్ల గురించి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కుంటుపడటానికి ట్రేడ్ యూనియన్ల ధోరణే ప్రధాన కారణమన్నారు. ‘‘ఎన్నో సంప్రదాయక పరిశ్రమలు ఈ ‘జెండా’ యూనియన్ల వల్లనే ఖాయలా పడ్డాయి. వాళ్లకు పని చేయాలని ఉండదు. వారి కారణంగానే దేశాభివృద్ధి నిలిచిపోయింది. ఈ రంగంలో దోపిడీ లేదని కాదు. కానీ, దానితో వ్యవహరించే దారులు కూడా ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. లక్షల్లో ఉన్న పని మనుషుల దుస్థితిని సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే, వారికి చట్టబద్ధత కల్పించేలా శాసన వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోలేమని స్పష్టం చేసింది.