కేంద్ర హోంశాఖ కార్యదర్శి మా ముందు హాజరవ్వాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:56 AM
దేశంలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలో తగిన సాయం అందించడానికి తమ ముందు హాజరుకావాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఠాణాల్లో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశంలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలో తగిన సాయం అందించడానికి తమ ముందు హాజరుకావాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని సుప్రీం కోర్టు ఆదేశించింది. మంగళవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. చాలా ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదంటూ పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న కోర్టు.. తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. మానవ హక్కుల ఉల్లంఘనలు అరికట్టడానికి అన్ని ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ 2018లోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక భద్రతా సమస్యలను కారణంగా చూపి పలుచోట్ల చైనా సంస్థకు చెందిన సీసీ కెమెరాలను తొలగించారన్న ఇటీవలి మీడియా కథనంపై కేంద్రం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో కేంద్రం ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్ రాజా చెప్పారు.