అరుణాచల్ సీఎం ఫ్యామిలీకి కాంట్రాక్టులు..సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:42 AM
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కుటుంబసభ్యులకు ఆ రాష్ట్రంలో పలు కాంట్రాక్టులను కట్టబెట్టారన్న ఆరోపణలపై ప్రాథమిక ..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కుటుంబసభ్యులకు ఆ రాష్ట్రంలో పలు కాంట్రాక్టులను కట్టబెట్టారన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని సీబీఐని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. రెండు వారాల్లో ఆ పని చేయాలని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ క్రమంలో 2015 జనవరి ఒకటి నుంచి 2025 డిసెంబరు 31 వరకు ఆ రాష్ట్రంలో మంజూరు చేసిన, పూర్తిచేసిన పనులు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లపై విచారణ జరపాలని ఆదేశాల్లో పేర్కొంది. 16 వారాల్లో దీనిపై విచారణ జరిపి నివేదిక తమ ముందు ఉంచాలని తెలిపారు. గత పదేళ్లలో రూ.1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు, పనులను అరుణాచల్ సీఎం కుటుంబసభ్యులకు చెందిన నాలుగు సంస్థలకు అప్పగించారని కోర్టు దృష్టికి వచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు న్యాయవాది ప్రశాంత్భూషణ్ ద్వారా ఈమేరకు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. కాగా సుప్రీం ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ చెప్పే... ‘తినను... తిననివ్వను’ అనే మాటలు బూటకమేనని సుప్రీం ఆదేశాలతో తేలిపోయిందని పేర్కొంది. ఇది ఆరంభం మాత్రమేనని.. రానున్న కాలంలో పలువురు బీజేపీ సీఎంలు అదే కేటగిరీలో ఉంటారని ఎద్దేవా చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో త్వరలో మాజీ కానున్న ఒక సీఎం తప్పనిసరిగా ఈ జాబితాలో ఉంటారని పేర్కొంది.