Share News

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సునేత్ర

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:47 AM

విమాన ప్రమాదంలో మరణించిన ఎన్‌సీపీ అధినేత అజిత్‌ పవార్‌ స్థానంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్‌ శనివారం ప్రమాణం చేయనున్నారు.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సునేత్ర

  • నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అజిత్‌ పవార్‌ సతీమణి.. క్రీడలు, ఎక్సైజ్‌ శాఖల కేటాయింపు

  • అజిత్‌ నిర్వహించిన ఆర్థిక శాఖ ఫడణవీస్‌ వద్దే

  • 2 వారాల్లో రెండు ఎన్‌సీపీల విలీనం?

  • అధ్యక్ష రేసులో పవార్‌, సునేత్ర, సుప్రియ, ప్రఫుల్‌

ముంబై, జనవరి 30: విమాన ప్రమాదంలో మరణించిన ఎన్‌సీపీ అధినేత అజిత్‌ పవార్‌ స్థానంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్‌ శనివారం ప్రమాణం చేయనున్నారు. ఈ పదవి చేపట్టాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తికి ఆమె అంగీకారం తెలిపారని సీనియర్‌ నాయకుడు, మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమెను శనివారమే తమ శాసనసభాపక్ష నేతగా ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా.. దివంగత పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ఆర్థిక, ప్రణాళికా శాఖలు చూసేవారు. ఎక్సైజ్‌, యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి, క్రీడలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో సునేత్ర ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను నిర్వహించలేరని.. ఆమెకు ఎక్సైజ్‌, క్రీడల శాఖలు ఇస్తామని.. ఆర్థిక శాఖ ప్రస్తుతానికి సీఎం ఫడణవీస్‌ వద్దే ఉంటుందని బీజేపీ నాయకత్వం ఎన్‌సీపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఆర్థిక శాఖను ఎన్‌సీపీకి ఇస్తామని ప్రతిపాదించిందని.. ఇందుకు వారు సమ్మతించినట్లు సమాచారం. అజిత్‌ మరణంతో బారామతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో సునేత్ర బరిలోకి దిగనున్నారు.


విలీనంపై జోరుగా మంతనాలు..

మరోవైపు... రెండు ఎన్‌సీపీల విలీనం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ-ఎ్‌సపీ, దివంగత అజిత్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్‌సీపీ రెండు వారాల్లో కలిసిపోతాయని రెండు వర్గాల నుంచీ సంకేతాలు అందుతున్నాయి. అయితే విలీనం తర్వాత పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంపై ప్రస్తుతం పవార్‌ కుటుంబంలో జోరుగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పవార్‌తో పాటు అజిత్‌ భార్య సునేత్ర పవార్‌, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలె, ఎన్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రఫుల్‌ పటేల్‌ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనే రెండు ఎన్‌సీపీలు కలిపిపోవాలని అజిత్‌ పవార్‌ కూడా ఆశించారని.. ఎన్‌సీపీ-ఎ్‌సపీ నేత జయంత్‌ పాటిల్‌తో ఈ దిశగా చర్చలు కూడా జరిపారని.. ప్రస్తుత జడ్పీ ఎన్నికల తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారని పవార్‌ పార్టీ నేతలు అంటున్నారు. అయితే అజిత్‌ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో విలీనానికి సుముఖంగా లేరు. అజిత్‌ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేత.. మహాయుతి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విలీనం అయితే, తర్వాత పార్టీ వైఖరి ఎలా ఉంటుంది..ఫడణవీస్‌ ప్రభుత్వంలో కొనసాగుతుందా లేదా అనేది అసలు ప్రశ్న. ప్రభుత్వం నుంచి వైదొలిగే ఉద్దేశం ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు లేదు. అందుకే అజిత్‌ నిర్వహించిన శాఖల భర్తీపై తొలుత దృష్టిపెట్టాలని, ఆ తర్వాతే విలీనంపై చర్చలకు వెళ్లాలని వారు పట్టుబడుతున్నారు. కాగా, బారామతి విమాన ప్రమాదంపై రాష్ట్ర సీఐడీ విభాగం శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది.

Updated Date - Jan 31 , 2026 | 03:47 AM