త్వరలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:37 AM
సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించేందుకు దక్షిణ భారత స్థాయి ముఖ్యమంత్రుల సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించనున్నట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు.
సమాఖ్య వ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం తీరు: సిద్దు
బెంగళూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించేందుకు దక్షిణ భారత స్థాయి ముఖ్యమంత్రుల సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించనున్నట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఈ సమావేశం త్వరలోనే జరుగుతుందని వెల్లడించారు. బెంగళూరులో మంగళవారం జరిగిన ‘సమాజవాదీ అధ్యయన కేంద్రం-సమాజవాదుల ప్రత్యేక సమావేశం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను నాశనం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తగ్గుతున్నాయని, దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటక డీజీపీ రామచంద్రరావు సస్పెన్షన్
రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ (డీసీఆర్ఈ) డీజీపీ కె.రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అశ్లీల వీడియోలు వైరల్ కావడంతో సీఎం సిద్దరామయ్య విచారణకు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా రామచంద్రరావు నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.