నకిలీ ప్రొఫైళ్లు, పెళ్లికూతుళ్లలా టెలీకాలర్లు
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:50 AM
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దొరికిన అమ్మాయిల ఫొటోలతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించడం.. పెళ్లి చేసుకునేందుకు వధువును వెతుక్కుంటున్న యువకులకు వాటిని పంపడం.
‘షాదీ పార్ట్నర్’ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దొరికిన అమ్మాయిల ఫొటోలతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించడం.. పెళ్లి చేసుకునేందుకు వధువును వెతుక్కుంటున్న యువకులకు వాటిని పంపడం. వాటిలో ఏదైనా ప్రొఫైల్ నచ్చిందని వారు చెబితే.. పెళ్లి కూతురినంటూ ఓ టెలీకాలర్తో మాట్లాడించడం.. కొద్ది రోజులు సాగదీసి ఏదో ఒక సాకు చెప్పి సంబంధం నచ్చలేదని క్యాన్సిల్ చేసుకోవడం.. ఈ లోపు మెంబర్షిప్ ఫీజుల(ఒక్కొక్కరి నుంచి రూ.2500 నుంచి రూ.15వేలు దాకా) పేరిట యువకుల వద్ద అందినకాడికి దోచుకోవడం.. దోచుకున్నదానిలో ఆ టెలీకాలర్కు కమీషన్ ఇవ్వడం.. ఇలా పెళ్లి కాని యువకులేలక్ష్యంగా భారీ మోసానికి పాల్పడుతున్న ‘షాదీ పార్ట్నర్’ అనే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా నాయకుడు అమిత్ కుమార్ అనే ఓ అడ్వకేట్ కావడం గమనార్హం. ఈ కేసులో సంస్థ యజమానిగా కాగితాల్లో పేర్కొన్న మహిళ(44)తోపాటు టెలీకాలర్లుగా పని చేస్తున్న మరో ఎనిమిది మంది మహిళలను అరెస్టు చేశారు. ఆ 44 ఏళ్ల మహిళను విచారించిన క్రమంలో అమిత్ కుమార్ పాత్ర వెల్లడైంది. అమిత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.