Share News

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టు సమన్లు..

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:30 AM

మనీలాండరింగ్‌ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టు సమన్లు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: మనీలాండరింగ్‌ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. హరియాణాలోని షికోపూర్ భూ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్‌ జరిగిందంటూ ఈడీ గతేడాది జూలైలో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన రౌస్‌ అవెన్యూ కోర్టు.. వాద్రాతో పాటు ఇతర నిందితులు మే 16న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2008లో షికోపూర్లో 3.53 ఎకరాల భూమిని మోసపూరితంగా కొనుగోలు చేసి వాద్రా అక్రమ ఆదాయాన్ని ఆర్జించారని ఈడీ ఆరోపిస్తోంది. ‘వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ 7.50 కోట్లకు ఆ భూమిని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో అసలు చెల్లింపులే జరగలేదు. నకిలీ చెక్కుల వివరాలను దస్తావేజుల్లో పొందుపర్చారు. అలాగే అదే భూమిని 2012లో ప్రముఖ డీఎల్‌ఎఫ్‌ కంపెనీకి రూ.58 కోట్లకు విక్రయించారు’ అని ఈడీ పేర్కొంది.

Updated Date - Apr 16 , 2026 | 03:30 AM