ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్!
ABN , Publish Date - May 30 , 2026 | 03:22 AM
కరెన్సీ నోట్లు అంటే చాలు.. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. తడిసినా, మడతపెట్టినా ఎక్కడ చిరిగిపోతాయోనని భయం.. పైగా అచ్చం అసలు నోట్లను పోలినట్టుగా నకిలీ నోట్ల బెడ ద అదనం..
నకిలీ నోట్లకు చెక్పెట్టేలా ఫీచర్లు
ఎక్కువ కాలం మన్నిక.. ఆర్బీఐ కసరత్తు
ముంబై, మే 29: కరెన్సీ నోట్లు అంటే చాలు.. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. తడిసినా, మడతపెట్టినా ఎక్కడ చిరిగిపోతాయోనని భయం.. పైగా అచ్చం అసలు నోట్లను పోలినట్టుగా నకిలీ నోట్ల బెడ ద అదనం.. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ నోట్లను మన దేశంలో ప్రవేశపెట్టేందుకు రిజర్వు బ్యాంకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుత కాగితపు కరెన్సీ కంటే ఎక్కువ కాలం మన్నిక ఉండే, ప్రత్యేక భద్రతా ఫీచర్లతో కూడిన ప్లాస్టిక్ కరెన్సీతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది.
ఇప్పటికీ నగదుకు తగ్గని డిమాండ్
మన దేశంలో కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే అందులో చాలా వరకు చిన్న చిన్న మొత్తాల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే. ఒక మోస్తరు లావాదేవీల్లో నగదు చలామణీయే ఎక్కువ. డిజిటల్ చెల్లింపులపై నిఘా ఉంటుందని, ఆదాయ పన్ను, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపారులు ఒకస్థాయికి మించి ఆన్లైన్ చెల్లింపులను స్వీకరించడం లేదు. నగదు ఇవ్వాలనే కోరుతున్నారు. నగదుగా ఇస్తే ధర కాస్త తగ్గిం చి ఇస్తున్నవారూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ వినియోగం తక్కువ. అవగాహన లేకపోవడం, మోసాల భయం, ఆన్లైన్ చెల్లింపులకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వ్యయం వంటివి సమస్యగా మారాయి. ఈ కారణాలతో ఇటీవల కాలంలో నగదు వినియోగం మళ్లీ పె రిగిపోతోంది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశంలో రూ.42.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయి. అంతకుముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది 11.5ు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ కరెన్సీనీ ప్రవేశపెట్టేందుకు రిజర్వు బ్యాంకు కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం ముద్రణ కోసం భారీ ఖర్చు..
రిజర్వు బ్యాంకు దేశంలో ఏటా పాతబడిన, చిరిగి న కరెన్సీ నోట్లను ధ్వంసం చేస్తుంది. వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించి విడుదల చేస్తుంది. ఇలా 2023-24లో నోట్ల ముద్రణకు రూ.5,101 కోట్ల ఖర్చుకాగా, 2024-25లో వ్యయం రూ.6,372 కోట్లకు పెరిగింది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలతో ఈ వ్యయం మరింతగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల పట్నా, ముంబైలలో నిర్వహించిన రెండు బోర్డు సమావేశాల్లో ఆర్బీఐ అధికారులు ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టే అంశంపై చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత ప్ర యోగాత్మకంగా రూ.10, రూ.20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ను విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిపాయి. ప్రజలస్పందన, సౌలభ్యం, ముద్రణ ఖర్చు ఆధారం గా అవసరమైన మార్పులతో రూ.200, 500 నోట్లు కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలిపాయి.