రిఫైనరీ అగ్ని ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:38 AM
రాజస్థాన్ పచపద్రలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రాజస్థాన్ పచపద్రలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ కోసం మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎమ్మార్పీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్ నేతృత్వంలో నలుగురుసభ్యుల నిపుణుల బృందాన్ని నియమించింది. వెంకటేశ్ బృందం ఇప్పటికే ప్రమాదస్థలిని సందర్శించి ఆ పనిలో నిమగ్నమైంది. రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (సీడీయూ) సెక్షన్లోని హీట్ ఎక్స్చేంజ్ సర్క్యూట్కు చెందిన ఒక వాల్వ్ లేదా ప్లాంజ్ నుంచి హైడ్రో కార్బన్ లీకేజీ కావడంతోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదం కారణంగా రిఫైనరీ ప్లాంట్లో పెద్దగా నష్టం జరగలేదని, యూనిట్లన్నీ సురక్షితంగా ఉన్నాయని హెచ్పీసీఎల్ తెలిపింది. పచపద్ర రిఫైనరీని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించాల్సి ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ఫలితంగా రిఫైనరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ వాయిదా వేసింది.