ఒత్తిళ్లతోనే మోదీ అమెరికాకు దాసోహం: రాహుల్
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:13 AM
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన నోరునొక్కారని.. ఒత్తిళ్ల కారణంగానే ఆయన అమెరికాకు సంపూర్తిగా దాసోహమై ఒప్పందానికి అంగీకరించారని ఆరోపించారు. ఈ ఒప్పందంతో భారత్కు చాలా తక్కువ లబ్ధి కలుగుతుందని.. అమెరికాకు ఎన్నో ప్రయోజనాలని శుక్రవారం ‘ఎక్స్’లో విమర్శించారు. ‘అమెరికన్లను సంతృప్తిపరచడానికి మన అన్నదాతలను ఎందుకు బలిచేశారు? మన చమురు సరఫరాలను అమెరికా నియంత్రించేలా ఇంధన భద్రతపై ఎందుకు రాజీపడ్డారు’ అని ప్రశ్నించారు. కాగా.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులపై పడే ప్రతికూల ప్రభావాలను తెలియజేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మేళనాలను నిర్వహించనుంది. ఈ నెల 24న వీటికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ కార్యక్రమానికి రాహుల్, ఖర్గే హాజరు కానున్నారు.