ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు బర్తరఫ్ చెయ్యట్లేదు?
ABN , Publish Date - May 18 , 2026 | 02:30 AM
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ హయాంలో...
పేపర్ లీకేజీలపై ఎందుకు మాట్లాడడం లేదు: రాహుల్
న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ హయాంలో ప్రశ్నపత్రాలు పదేపదే లీక్ అవుతున్నా ఆయన్ను ఎందుకు పదవి నుంచి బర్తరఫ్ చేయడం లేదని ప్రధాని మోదీని నిలదీశారు. అంతేకాక, ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ‘‘2024లో నీట్ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్షను రద్దు చేయలేదు. మంత్రి రాజీనామా చెయ్యలేదు. సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఓ విచారణ కమిటీని వేశారు. మళ్లీ 2026 నీట్ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష రద్దయింది. మంత్రి ఇప్పటికీ రాజీనామా చేయలేదు. మళ్లీ సీబీఐ విచారణ చేపట్టింది. విచారణకు మరో కమిటీ ఏర్పాటైంది. ఎందుకు ప్రశ్నపత్రాలు పదేపదే లీకవుతున్నాయి? ‘పరీక్షా పే చర్చ’.. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీపై మీరెందుకు ఎప్పుడూ మౌనంగా ఉంటున్నారు ? వరుసగా విఫలమవుతున్నా విద్యా శాఖ మంత్రిని మీరెందుకు బర్తరఫ్ చెయ్యడం లేదు? ప్రధాని మోదీ దీనికి సమాధానం చెప్పాలి’’ అంటూ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.