పరువు నష్టం దావాలో లిఖితపూర్వకంగా రాహుల్ ‘విచారం’
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:59 AM
పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ హైకోర్టులో...
జబల్పూర్, జూన్ 25: పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ హైకోర్టులో లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి బుధవారం రాహుల్ తరఫు న్యాయవాది ఈ దరఖాస్తు అందజేశారు. 2018లో జబువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన రాహుల్.. కార్తికేయ సింగ్కు పనామా పేపర్ల లీకేజీ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఇది తనకు పరువు నష్టం కలిగించేదని పేర్కొంటూ కార్తికేయ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో దావా వేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రాహుల్.. కేసును కొట్టివేయాలని కోరారు. తాను చేసిన వ్యాఖ్యలు కార్తికేయ సింగ్ ఉద్దేశించి చేసినవి కావని తెలిపారు. గురువారం వాదనలు విన్న జస్టిస్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ తీర్పును వాయిదా వేశారు.