తమిళనాడులో బిహార్ నమూనా!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:12 AM
నితీశ్ను సీఎంగా ఒక వ్యూహం ప్రకారం తప్పించిన బిహార్ నమూనానే బీజేపీ తమిళనాడులో కూడా అమలు చేయాలని అనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
అన్నాడీఎంకేని తప్పించి సీఎంగా బీజేపీ అభ్యర్థి
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్
చెన్నై, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): నితీశ్ను సీఎంగా ఒక వ్యూహం ప్రకారం తప్పించిన బిహార్ నమూనానే బీజేపీ తమిళనాడులో కూడా అమలు చేయాలని అనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం తమిళనాడులోని తూత్తుకుడిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా మోదీ నడుచుకుంటున్నారని అన్నారు. ‘ట్రంప్ దూకమని చెప్తే.. మన ప్రధాని అది కూడా చేసేస్తారు’ అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, ట్రంప్ చెప్పిన మాటకు తలొగ్గి మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారన్నారు. ‘మోదీ అలా ప్రవర్తించేందుకు కారణం.. ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ’ అని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ద్వారా తమిళనాడును తమ నియంత్రణలో పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోందన్నారు.