ప్రసార భారతి చైర్మన్గా రచయిత ప్రసూన్ జోషి
ABN , Publish Date - May 03 , 2026 | 04:03 AM
ప్రభుత్వ ప్రసార సంస్థ ‘ప్రసార భారతి’ చైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత, ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వ ప్రసార సంస్థ ‘ప్రసార భారతి’ చైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత, ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన భావగర్భితమైన రచనలతో, సామాజిక స్పృహ కలిగిన కథనాలతో భారతీయ మీడియా రంగంలో ఆయన ఒక ప్రత్యేక ముద్ర వేశారు. జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. ‘‘ప్రసూన్ జోషి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అరుదైన సృజనాత్మక శక్తి. ఆయన మాటల్లో దేశ మట్టి వాసన కనిపిస్తుంది. ఆయన నాయకత్వంలో ప్రసార భారతి సరికొత్త ఉత్సాహంతో, ఆధునిక దృక్పథంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.