బంగ్లాదేశ్ శరణార్థులకు పౌరసత్వం ఇస్తాం
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:22 AM
శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ఓటర్లకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. (బంగ్లాదేశ్లో) మతపరమైన అణచివేతకు గురై బెంగాల్కు ...
పశ్చిమబెంగాల్ ఓటర్లకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ఓటర్లకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. (బంగ్లాదేశ్లో) మతపరమైన అణచివేతకు గురై బెంగాల్కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారుల సమస్య లేకుండా రాష్ట్రం సత్పరిపాలన మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన సందేశాన్ని ‘జై మహాకాళి’ నినాదంతో ప్రారంభించారు. పారిశ్రామికాభివృద్ధిలో ఒకప్పుడు ముందున్న బెంగాల్.. ఇప్పుడు దుష్పరిపాలన, విభజన రాజకీయాలతో అల్లాడుతోందని.. జనం విసిగిపోయారని.. రాష్ట్రంలో మార్పు అనివార్యమని తెలిపారు. ‘అతికొద్ది నెలల్లో రాష్ట్ర భవిష్యత్ నిర్ణయం కానుంది. వచ్చే తరం భవిష్యత్ ఎటువైపు సాగాలో మీ(ప్రజల) తీర్పుపైనే ఆధారపడి ఉంది. బెంగాల్లో నిరుద్యోగం ప్రబలుతోంది. మహిళల భద్రత ఆందోళన కలిగిస్తోంది. హింసాయుత సంస్కృతి వ్యాపించింది. మీరెంత కాలం మౌనంగా భరిస్తారు? రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాను. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. 2026లో పురోగామి బెంగాల్ సృష్టికి సమష్టిగా సంకల్పం తీసుకుందాం’ అని ప్రధాని పిలుపిచ్చారు.