రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోండి
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:02 AM
పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయాన్ని పొందేందుకు రైతులు పీఎం కిసాన్ పోర్టల్లో తమ వివరాలను సరిచూసుకుని...
పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముందు కేంద్రం సూచన
న్యూఢిల్లీ, మార్చి11: పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయాన్ని పొందేందుకు రైతులు పీఎం కిసాన్ పోర్టల్లో తమ వివరాలను సరిచూసుకుని, ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. పోర్టల్లో చెల్లింపు స్థితి, ఆధార్ అనుసంధానం, భూవివరాల నమోదు, ఈ-కేవైసీ వివరాలను రైతులు చూసుకోవచ్చు. ఓటీపీ, బయోమెట్రిక్ అవసరం లేకుండానే మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు విధానంతో ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. అనర్హులను తొలగించేందుకు పటిష్ఠమైన ధ్రువీకరణ పద్ధతులను అమలు చేస్తున్నట్లు, పొరపాటున లబ్ధిని వదులుకున్న వారు తిరిగి దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 13న అసోంలోని గువాహటీలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు.