పీఎఫ్ ట్రస్ట్ నిబంధనల హేతుబద్ధీకరణ
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:39 AM
పీఎఫ్ ట్రస్ట్లకు సంబంధించిన నిబంధనలను హేతుబద్ధీకరించాలని కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పీఎఫ్ ట్రస్ట్లకు సంబంధించిన నిబంధనలను హేతుబద్ధీకరించాలని కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఉద్యోగుల తరఫున సంస్థ యజమాని చెల్లించే వాటాలో సమానత్వంతో పాటు శాతం ఆధారిత పరిమితులను తొలగించాలని పేర్కొన్నారు. వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా యజమానులు, ఉద్యోగుల మధ్య సమాన విరాళాల వాటా తప్పనిసరి అనే నిబంధనను తొలగిస్తారు. ఇది కంపెనీలు అదనపు వాటా ఇవ్వడాన్ని సులభతరం చేస్తుంది.

గ్రామీణ ఉపాధికి ఆర్థిక చేయూత
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించింది. ఏడాదిలో 125 రోజులు ఉపాధి పనులు కల్పించే లక్ష్యంతో ఇటీవల కొత్తగా ప్రకటించిన వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ (గ్రామీణ్)) పథకానికి 2026-27 బడ్జెట్లో రూ. 95,692.31 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వీబీ-జీ రామ్ జీ పథకం అమల్లోకి వచ్చేవరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ కొనసాగుతోంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. దీనికి రూ. 30 వేల కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు.