పాస్పోర్ట్ రుసుముల పెంపు
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:00 AM
పాస్పోర్టుల జారీ ఫీజులను పెంచుతూ గురువారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 14 ఏళ్ల అనంతరం వీటిని పెంచుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నూతన ఫీజులు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
14 ఏళ్ల అనంతరం పెంచిన కేంద్రం
స్టాండర్డ్ పాస్పోర్టు ఫీజు-రూ.2,500
తత్కాల్ విధానంలో అయితే-రూ.5,000
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు
న్యూఢిల్లీ, జూన్ 25: పాస్పోర్టుల జారీ ఫీజులను పెంచుతూ గురువారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 14 ఏళ్ల అనంతరం వీటిని పెంచుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నూతన ఫీజులు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
18 ఏళ్లపైబడ్డవారికి జారీ చేసే 36 పేజీల స్టాండర్డ్ పాస్పోర్టుకు ఇకపై రూ.2,500 వసూలు చేస్తారు. ఇంతవరకు రూ.1,500 ఫీజుగా తీసుకుంటున్నారు.
తత్కాల్ విధానంలో అయితే ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.
60 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు పెరిగింది.
తత్కాల్ విధానంలో తీసుకోదలిస్తే ఇంతవరకు రూ.4,000 చెల్లిస్తుండగా, ఇకపై రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
పాస్పోర్ట్ పాడయినా, పోయినా కొత్తది తీసుకోవాలని అనుకుంటే.. 36 పేజీల పాస్పోర్ట్కు సాధారణ విధానంలో రూ.5,000, తత్కాల్ విధానంలో రూ.7,500 ఫీజు వసూలు చేస్తారు. అదే 60 పేజీల పాస్పోర్ట్కు సాధారణ విధానంలో రూ.6,000, తత్కాల్ విధానంలో రూ.8,500 చెల్లించాల్సి ఉంటుంది.
18 ఏళ్లలోపు వయసు ఉన్న మైనర్లకు.. 36 పేజీల పాస్పోర్ట్కు సాధారణ విధానంలో రూ.1,750, తత్కాల్ విధానంలో రూ.4,250; పాడైనవాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలంటే సాధారణ విధానంలో రూ.4,250, తత్కాల్ విధానంలో రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది.
ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను భారతదేశం పరిధికి సంబంధించినంతవరకు ఉచితంగా ఇస్తారు. విదేశాలకయితే 15 డాలర్లు (సుమారు రూ.1,500) చెల్లించాల్సి ఉంది. సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీని ఇండియాకు సంబంధించినంతవరకు రూ.1,000, విదేశాలకు 50 డాలర్లు (సుమారు రూ.5,000) చెల్లించాల్సి ఉంటుంది.
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ), సరెండర్ సర్టిఫికెట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రాం, ఇతరత్రా పనులకు భారతదేశం వరకు రూ.750, విదేశాలకు 40 డాలర్లు (సుమారు రూ.4,000) వసూలు చేస్తారు.