ఒరాకిల్లో 30,000 ఉద్యోగాలు కోత!
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:29 AM
ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు నిధుల వేట
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు భారీగా నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఒరాకిల్ దాదాపు 30వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇన్వె్స్టమెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ నివేదిక ప్రకారం ఒరాకిల్.. ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు రూ.14.27 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని బ్యాంకులు వెనుకడుగు వేస్తుండడంతో ఆ సంస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సుమారు 20,000 నుంచి 30,000 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. లేఆ్ఫ్సతో ఒరాకిల్కు రూ.73వేల కోట్లు నుంచి రూ.91వేల కోట్ల వరకూ ఖర్చు తగ్గే అవకాశం ఉందని టీబీ కోవెన్ నివేదిక అంచనా వేసింది. కాగా, నిధుల సమీకరణ కోసం ఒరాకిల్... హెల్త్కేర్ ఐటీ కంపెనీ ‘సెర్నర్’ను కూడా విక్రయించే ఆలోచనలో ఉంది.