చమురు, గ్యాస్ డేటా ఇవ్వకుంటే జైలుకే!
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:46 AM
పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నిత్యావసర సరుకుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
న్యూఢిల్లీ, మార్చి 20: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నిత్యావసర సరుకుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం ఉత్పత్తి, ప్రాసెసింగ్, రిఫైనింగ్, నిల్వ, రవాణా, దిగుమతి, ఎగుమతి, మార్కెటింగ్, పంపిణీ, వినియోగానికి సంబంధమున్న అన్ని చమురు, గ్యాస్ సంస్థలు.. సంబంధిత డేటాను పెట్రోలియం ప్లానింగ్-అనాలిసిస్ విభాగాని(పీపీఏసీ)కి నిరంతరం తప్పనసరిగా అందజేయాలని స్పష్టంచేసింది. దీనిని ఉల్లంఘిస్తే ఈ చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం నేరపూరిత చర్యగా పరిగణిస్తామని.. జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించింది. ఈ సమాచార సేకరణ, క్రోడీకరణ, నిర్వహణ, విశ్లేషణకు పీపీఏసీని నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించారు. సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) కంపెనీల ద్వారా పీఎన్జీకి మారాల్సిందిగా వాణిజ్య వంటగ్యాస్ వినియోగదారులను కోరుతున్నట్లు తెలిపారు. నెట్వర్క్ ఉన్న చోట్ల అత్యవసర కనెక్షన్లు ఇవ్వడమే గాక రాయితీలు కూడా ఇస్తున్నట్లు చెప్పారు.