గడువులోగా రహదారుల పనులు పూర్తి కావాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:18 AM
తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: కేంద్ర మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో బుధవారం తెలంగాణ, జమ్మూకశ్మీర్, లడఖ్లో చేపట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆయన వేర్వేరుగా సమీక్షించారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పర్యవేక్షక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. రహదారులపై మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వానాకాలంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చూడాలని, ఇందుకోసం సత్వర ప్రతిస్పందన బృందాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.