నేపాల్లో ఇకపై 15రోజులకోసారి జీతాలు!
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:41 AM
ప్రభుత్వ ఉద్యోగులకు వేతన చెల్లింపు విషయంలో నేపాల్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా అమలవుతున్న నెలవారీ వేతన విధానాన్ని రద్దు చేసి..
కాఠ్మాండు, ఏప్రిల్ 21: ప్రభుత్వ ఉద్యోగులకు వేతన చెల్లింపు విషయంలో నేపాల్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా అమలవుతున్న నెలవారీ వేతన విధానాన్ని రద్దు చేసి, ఇకపై 15రోజులకు ఒకసారి జీతాలు చెల్లించే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో నగదు చలామణీ పెంచి, ప్రజల చేతిలో నగదు నిరంతరం అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఈ విధానం ప్రకారం, ఉద్యోగుల నెలవారీ జీతాలు రెండు సమాన భాగాలుగా విడిపోయి ప్రతి 15 రోజులకోసారి ఖాతాల్లో జమ అవుతుంది. పక్షం రోజుల వ్యవధిలో నగదు అందుబాటులో ఉండటం వల్ల కొనుగోళ్లు పెరుగుతాయని, తద్వారా ఆర్థికవ్యవస్థ కూడా పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి చెల్లింపు విధానం ఇప్పటికే అమెరికా, అస్ట్రేలియా వంటి దేశాల్లో అమల్లో ఉంది. నేపాల్లో ఇది విజవంతమైతే, ఆర్థికవృద్ధి సాధించాలనుకునే ఇతర ప్రాంతీయ ఆర్థికవ్యవస్థలకు ఇదొక నమూనాగా నిలుస్తుందని భావిస్తున్నారు.