నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తలకు ‘లాక్డౌన్’
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:58 AM
నీట్ పరీక్ష పునఃనిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మరో అసాధారణ నిర్ణయం తీసుకుంది. నీట్ ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్న నిపుణులందరినీ లాక్డౌన్ చేసింది.
పేపరు తయారీతో సంబంధం ఉన్న వారంతా గోప్య ప్రదేశానికి తరలింపు
21న పరీక్ష పూర్తయ్యేవరకు అక్కడే...
న్యూఢిల్లీ, జూన్ 8 : నీట్ పరీక్ష పునఃనిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మరో అసాధారణ నిర్ణయం తీసుకుంది. నీట్ ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్న నిపుణులందరినీ లాక్డౌన్ చేసింది. ఇందులోభాగంగా వారిని ఓ గోప్య ప్రదేశానికి తరలించారు. ఈ నెల 21న నీట్ పరీక్ష పూర్తయ్యేవరకు వారు అక్కడే ఉంటారు. వారినుంచి అధికారులు సెల్ఫోన్లు, ల్యాప్టా్పలు, స్మార్ట్ వాచ్లు తదితర సమాచార, సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారంటూ ఓ ఇంగ్లిష్ పత్రిక కథనం ప్రచురించింది. 24 గంటలపాటూ వారిపై నిఘా ఉంటుందని, దాదాపు రెండు వారాలపాటు వారు ఇంటర్నెట్కు దూరంగా ఉంటారని అందులో వెల్లడించింది. కాగా, నీట్ పేపర్లు, ఇతర సరంజామా రవాణాకు వైమానిక దళాలను ఉపయోగించనున్నట్టు రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కాగా, నీట్ పేపర్లు మరోసారి లీక్ అయ్యాయన్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. మోసపూరిత ఉద్దేశంతోనే ఈ తరహా తప్పుడు, నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఆందోళన అక్కర్లేదని, పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలూ తీసుకుంటున్నామని తెలిపింది.