మరో ఇద్దరు నీట్ విద్యార్థినుల ఆత్మహత్య
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:29 AM
నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో అభ్యర్థులు ప్రాణాలు తీసుకోగా.. తాజాగా ప్రవేశ పరీక్ష ..
ఇండోర్/ మధ్యప్రదేశ్, జూన్ 23: నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో అభ్యర్థులు ప్రాణాలు తీసుకోగా.. తాజాగా ప్రవేశ పరీక్ష ముగిసిన గంటల వ్యవధిలోనే మరో ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒకరు పరీక్ష సరిగా రాయలేదనే మనస్తాపంతో ఇంట్లోనే ప్రాణాలు తీసుకోగా.. మరొకరు అనుమానాస్పద స్థితిలో నదిలో శవమై తేలారు. యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాకు చెందిన చంచల్ భారతి (19) జూన్ 21న నీట్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. పరీక్ష సరిగా రాయలేదనే ఒత్తిడితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న నీట్ ప్రశ్నపత్రంపై ‘‘నేనేమీ చేయలేను నాన్న’’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో, మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 21ఏళ్ల నిక్కి యాదవ్ ఆదివారం తన తమ్ముడితో కలిసి పరీక్ష రాయడానికి వెళ్లింది. పరీక్ష ముగిసిన తర్వాత.. తల్లికి ఫోన్ చేసి తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని, ఇంటికి బయలుదేరానని చెప్పింది. మరుసటి రోజు ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున నిక్కి మృతదేహం లభ్యమైంది. నీటిలో మునిగిపోవడం వల్లే ఆమె మరణించినట్లు తేలింది.