ఇంధన సంక్షోభంపై ఆందోళన వద్దు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:50 AM
దేశంలో ఇంధన కొరతపై కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.
రాజకీయంగానే కొందరి కుట్రలు: మోదీ
న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో ఇంధన కొరతపై కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. యుద్ధం ప్రభావం భారత్పై పడకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. గురువారం ఓ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఎజెండా ముఖ్యం అనుకునే కొందరు, ఎల్పీజీ కొరతపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. 2014నాటికి 14కోట్లుగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్లు నేడు 33కోట్లకు చేరాయని, అలాగే ఎల్పీజీ టెర్మినల్స్ సంఖ్య కూడా రెట్టింపు అయిందని గుర్తుచేశారు. ఇంధన రంగంలో దేశంలో స్వయం సమృద్ధి సాధిస్తోందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ప్రభావం ప్రతి దేశంపైనా ఏదో ఒక స్థాయిలో ఉందని, దీనికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.