మైనర్ల పాస్పోర్టు 18 ఏళ్లు నిండేవరకూ చెల్లుబాటు
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:16 AM
పదిహేనేళ్లలోపు పిల్లలకు జారీ చేసే పాస్పోర్టు ఇప్పుడు 18 సంవత్సరాలు నిండే వరకూ చెల్లుబాటు అవుతుంది. ఈమేరకు విదేశాంగ శాఖ చేసిన సవరణలు గెజిట్గా ప్రచురితమయ్యాయి. సెప్టెంబరు 15న అది ప్రచురితమైన నాటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయని జాయింట్ సెక్రటరీ, చీఫ్ పాస్పోర్టు అధికారి బీఎస్ ముబారక్ తెలిపారు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: పదిహేనేళ్లలోపు పిల్లలకు జారీ చేసే పాస్పోర్టు ఇప్పుడు 18 సంవత్సరాలు నిండే వరకూ చెల్లుబాటు అవుతుంది. ఈమేరకు విదేశాంగ శాఖ చేసిన సవరణలు గెజిట్గా ప్రచురితమయ్యాయి. సెప్టెంబరు 15న అది ప్రచురితమైన నాటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయని జాయింట్ సెక్రటరీ, చీఫ్ పాస్పోర్టు అధికారి బీఎస్ ముబారక్ తెలిపారు. పదేహేనేళ్ల బాలబాలికలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్పోర్టు... అది జారీ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు లేదా ఆ బాలుడు/బాలికకు 18 సంవత్సరాలు నిండే వరకూ (వీటిలో ఏది ముందయితే అంతవరకూ) మాత్రమే చెల్లుబాటు అవుతుంది. గతంలో ఇదే పాస్పోర్టు జారీ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు లేదా 15 ఏళ్లు నిండేవరకూ(వీటిలో ఏది ముందయితే అంతవరకూ) మాత్రమే చెల్లుబాటు అయ్యేది. కాగా, వివిధ కేటగిరీల్లో పాస్పోర్టు జారీ ఫీజులను జూలై 1 నుంచే మార్చిన విషయం తెలిసిందే. 36పేజీల పాస్పోర్టు ఫీజు రూ.2500, 60 పేజీల పాస్పోర్టు ఫీజు రూ.3500 చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల పాస్పోర్టు కోసం తత్కాల్లో దరఖాస్తు చేస్తే రూ.5000, అదే 60 పేజీలదైతే రూ.6000కు చెల్లించాలని గెజిట్లో పేర్కొన్నారు