ఎల్పీజీతో ‘మంగళూరు’కు భారీ నౌక
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:30 AM
కర్ణాటకలోని మంగళూరు ఓడరేవుకు అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్తో కూడిన భారీ షిప్ చేరుకుంది. ఈ షిప్ 229 మీటర్ల పొడవు, 37.24 మీటర్ల వెడల్పు ఉంది. సింగపూర్ జెండా కలిగిన పైక్సిస్ పయనీర్ పేరు ఉన్న..
బెంగళూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని మంగళూరు ఓడరేవుకు అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్తో కూడిన భారీ షిప్ చేరుకుంది. ఈ షిప్ 229 మీటర్ల పొడవు, 37.24 మీటర్ల వెడల్పు ఉంది. సింగపూర్ జెండా కలిగిన పైక్సిస్ పయనీర్ పేరు ఉన్న ఈ నౌక 47,236 టన్నుల ఎల్పీజీతో వచ్చింది. అలాగే, రష్యా నుంచి ముడి చమురుతో బయలుదేరిన అక్వాటైటాన్ అనే మరో నౌక శనివారం రాత్రి పొద్దుపోయాక మంగళూరుకు చేరుకుంది. అందులో నుంచి ఆదివారం మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీఎల్)కు 96వేల టన్నుల ముడిచమురును దింపినట్టు అధికారులు ప్రకటించారు. నిజానికి, జనవరి చివరిలో బాల్టిక్ ఓడరేవులో సరుకు నింపుకున్న ఈ షిప్ చైనాలోని రిజావో ఓడరేవుకు వెళ్లాల్సి ఉంది. అయితే, సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా ఇటీవల భారత్కు అనుమతినిచ్చింది. దీంతో భారత రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే చైనాకు వెళ్లాల్సిన ఆక్వా టైటాన్ భారత్కు చేరింది. కాగా, మరో నాలుగు నౌకలు సముద్రంలో ఉన్నాయని, త్వరలోనే భారత్కు చేరుకుంటాయని ఎంఆర్పీఎల్ ప్రతినిధులు తెలిపారు.