టీఎంసీకి 226 సీట్లు ఖాయం: మమత
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:19 AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను తన పార్టీ 226 సీట్లలో విజయం సాధిస్తుందని టీఎంసీ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీ అన్నారు.
సూరీ, ఏప్రిల్ 13: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను తన పార్టీ 226 సీట్లలో విజయం సాధిస్తుందని టీఎంసీ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఢిల్లీ నుంచి తరలించిన బలగాలను ఉపయోగించి బీజేపీ గెలువజాలదని స్పష్టంచేశారు. తనను ఢీకొనేందుకు కేంద్రప్రభుత్వం, 19 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏకమయ్యాయని చెప్పారు. అయినప్పటికీ సామాన్య ప్రజల కోసం ఒంటిచేత్తో పోరాడుతున్నానని తెలిపారు. సోమవారం బీర్భూమ్ జిల్లా సూరీలో జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. బీజేపీ డబ్బు పంపిణీ చేస్తోందని.. అధికారులను, పోలీసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తోందని ధ్వజమెత్తారు. డబ్బు, డ్రగ్స్, ఆయుధాలు, ఓటర్లను బెంగాల్లోకి అక్రమ రవాణా చేస్తున్నారని.. ముఖ్యంగా బిహార్ నుంచి రైళ్లు, బస్సుల్లో జనాలను దించుతున్నారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే బెంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తామన్న మోదీ హామీపై మండిపడ్డారు. తాను ప్రధానిని అయితే ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానని గతంలో ఆయన చేసిన వాగ్దానం ఏమైందని నిలదీశారు. బెంగాల్లో ఈ నెల 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.