నాపై అనర్హత వేటు పడేలా బీజేపీ కుట్ర: మమత
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:43 AM
దక్షిణ కోల్కతాలోని భబానీపూర్ నుంచి పోటీ చేస్తున్న తనపై అనర్హత వేటు పడేలా బీజేపీ కుట్ర పన్నిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
భబానీపూర్, ఏప్రిల్ 11: దక్షిణ కోల్కతాలోని భబానీపూర్ నుంచి పోటీ చేస్తున్న తనపై అనర్హత వేటు పడేలా బీజేపీ కుట్ర పన్నిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా శుక్రవారం బీజేపీ రెండు తప్పుడు అఫిడవిట్లను సమర్పించిందని, తన అభ్యర్థిత్వం రద్దయ్యేలా యత్నించిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. తప్పుడు మార్గాల్లో ఓట్లను పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ సాయంతో 90 లక్షల ఓట్లను తొలగించిందని, ఇకపై ఈవీఎంలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున బీజేపీ ఆధిక్యం ఉన్న స్థానాలను తొలుత ప్రకటిస్తారని, తక్కువ ఓట్లు వచ్చిన చోట ఈవీఎంలను తారుమారు చేస్తారని మమత అన్నారు.