మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:18 AM
పేపర్ లీకయిన నేపథ్యంలో మహారాష్ట్రలో ఆదివారం జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడింది. థానె జిల్లాలోని భివాండి ..
పరీక్ష వాయిదా.. ముగ్గురు వ్యక్తుల అరెస్టు
న్యూఢిల్లీ, జూన్ 27: పేపర్ లీకయిన నేపథ్యంలో మహారాష్ట్రలో ఆదివారం జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడింది. థానె జిల్లాలోని భివాండి పట్టణంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో కొందరి దగ్గర ఉన్న పేపర్లలోని ప్రశ్నలు వాస్తవ పేపర్తో సరిపోలాయని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. భివాండి పోలీసులు దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. టెట్ను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎంఎస్సీఈ) ప్రకటించింది. పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షకు మళ్లీ రిజిస్టర్ చేసుకొనేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎంఎస్సీఈ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొత్తం ఆరు లక్షల మంది టెట్ రాస్తున్నట్లు తెలిపారు. పేపర్ లీకునకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఉదంతం పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యానికి మరో నిదర్శనంగా నిలిచిందని కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు దీప్కే అన్నారు. కాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ పర్యావరణవేత్త సోనమ్ వాన్చుక్ ఆదివారం నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నారు.