అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:20 AM
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. ‘‘అజిత్ దాదా.. అమర్ రహే’’ అంటూ అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
బారామతి, జనవరి 29: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. ‘‘అజిత్ దాదా.. అమర్ రహే’’ అంటూ అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వేలాది మంది ఎన్సీపీ కార్యకర్తలు అజిత్ పవార్ అంత్యక్రియలకు తరలివచ్చారు. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ కాలేజీ మైదానంలో అధికారిక లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కాలేజీని పవార్ కుటుంబమే స్థాపించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్, ఏపీ మంత్రి లోకేశ్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అజిత్ పవార్ కుమారులు పార్థు, జై చితికి నిప్పంటించారు. కాగా, అజిత్ పవార్ ప్రయాణించిన లియర్జెట్-45 విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ ప్రమాదంపై స్పందించింది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. దర్యాప్తు ముగిసేంతవరకు ప్రమాదానికి గల కారణం ఏంటనేది చెప్పలేదని పేర్కొంది. దర్యాప్తులో అధికారులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపింది. బాంబార్డియర్ ప్రధాన కార్యాలయం కెనడాలో ఉంది.