Madras High Court: ఇంట్లో విగ్రహాలు ప్రతిష్ఠించుకునే హక్కు ఉంది
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:27 AM
ఎవరైనా తమ ఇంటి ఆవరణలో ఏదైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని, ఒంటరిగా లేదా స్నేహితులను, పొరుగువారిని ఆహ్వానించి శాంతియుతంగా పూజించుకునే హక్కులో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని....
ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదు: మద్రాస్ హైకోర్టు
చెన్నై, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఎవరైనా తమ ఇంటి ఆవరణలో ఏదైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని, ఒంటరిగా లేదా స్నేహితులను, పొరుగువారిని ఆహ్వానించి శాంతియుతంగా పూజించుకునే హక్కులో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నైలోని ఎన్నూరుకు చెందిన ఎ.కార్తీక్ తన ఇంట్లో శివశక్తి, దక్షీశ్వరి, వినాయకుడు, వీరభద్రన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించాయంటూ ఆ విగ్రహాలను ప్రభుత్వ అధికారులు తొలగించారు. కార్తీక్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి జస్టిస్ భరత చక్రవర్తి విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు లేదా విగ్రహం మానవులెవరికీ హాని చేయవు. విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మరణాలు సంభవించాయన్నది మాఢనమ్మకం మాత్రమే’ అన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా మూఢనమ్మకాలకు తలొగ్గరాదని హితవు పలికారు. తొలగించిన విగ్రహాలను తిరిగి పిటిషనర్కు అప్పగించాలని ఆదేశించారు.