కన్నబిడ్డకు కిడ్నీ ఇవ్వాలంటే తల్లికి డీఎన్ఏ పరీక్ష అవసరం లేదు
ABN , Publish Date - May 24 , 2026 | 03:58 AM
కన్న బిడ్డకు కిడ్నీ దానం చేసేందుకు ఏ తల్లీ తన మాతృత్వాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
తల్లీబిడ్డ అని గుర్తింపు కార్డు ఉంటే చాలు: మద్రాస్ హైకోర్టు
చెన్నై, మే 23 (ఆంధ్రజ్యోతి): కన్న బిడ్డకు కిడ్నీ దానం చేసేందుకు ఏ తల్లీ తన మాతృత్వాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లీబిడ్డల బంధాన్ని తెలిపే ప్రభుత్వ గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తేల్చిచెప్పింది. తన కుమారుడు రోహిత్కుమార్కు రెండు కిడ్నీలు పాడైపోయాయని, అతడ్ని బతికించుకునేందుకు తాను కిడ్నీలు దానం చేసేందుకు ముందుకొచ్చినా, అందుకు అవసరమైన ఆధార్, రేషన్ కార్డు, కుటుంబ ఫొటోలు అందించినా, తమిళనాడు ప్రభుత్వ అవయవ మార్పిడి అధికారిక కమిటీ అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ పశ్చిమబెంగాల్కు చెందిన రీటా ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్పత్రిలో తల్లి తన బిడ్డకు కిడ్నీలు దానం చేయాలంటే డీఎన్ఏ పరీక్ష ద్వారా తన మాతృత్వాన్ని నిరూపించుకోవాలని ఆ కమిటీ చెప్పిందని, తన బిడ్డ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్లాడుతున్నందున తక్షణం అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది.