భారత్ చేరిన ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:30 AM
దేశంలో వంటగ్యాస్ కొరత అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ.. ఓ సానుకూల పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ నుంచి బయలుదేరి మూడు రోజుల క్రితమే హోర్ముజ్ జలసంధిని దాటిన ...
న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో వంటగ్యాస్ కొరత అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ.. ఓ సానుకూల పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ నుంచి బయలుదేరి మూడు రోజుల క్రితమే హోర్ముజ్ జలసంధిని దాటిన శివాలిక్ అనే ఎల్పీజీ నౌకా ట్యాంకర్.. సోమవారం గుజరాత్ తీరానికి చేరింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ను దాటిని మరో ఎల్పీజీ ట్యాంకర్ నందాదేవి నేడు ముంబై పోర్టుకు చేరుకొనే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రెండు ట్యాంకర్లలో కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. యూఏఈ నుంచి 80,800 టన్నుల ముడి చమురుతో వస్తున్న జగ్ లాడ్కి నౌక కూడా నేడు భారత్కు చేరుకోనుంది. కాగా, గత నెలలో భారత్ సీజ్ చేసిన తము మూడు చమురు నౌకలను వదిలిపెట్టాలని భారత్కు ఇరాన్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.