ఖమేనీ మృతితో అలీపుర శోకసంద్రం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:09 AM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్తతో కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా గౌరీబిదనూరు తాలూకా అలీపుర గ్రామం శోకసంద్రంగా మారింది.
1986లో కర్ణాటకలోని అలీపురను సందర్శించిన ఖమేనీ
బెంగళూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్తతో కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా గౌరీబిదనూరు తాలూకా అలీపుర గ్రామం శోకసంద్రంగా మారింది. ‘మినీ ఇరాన్’గా పిలిచే అలీపుర గ్రామంలో స్థానికులు ఆదివారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ర్యాలీ చేపట్టారు. షియాలు అధికంగా ఉండే ఈ గ్రామంలో.. ఇరాన్ సుప్రీం నాయకుడికి నివాళిగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. 1986లో ఖమేనీ అలీపుర గ్రామానికి వచ్చారు. స్థానిక మసీదులో నమాజ్ చదివారు. ఆయన పర్యటన తర్వాత అలీపుర, ఇరాన్ మధ్య బంధం మరింత బలపడింది. అలీపురలోని 20 వేల మంది ఖవేనీని మత గురువుగా భావిస్తారు. ఆయన పేరుతోనే స్థానికంగా ఓ ఆస్పత్రి కూడా ఉంది. ఖమేనీ మరణ వార్తతో ఈ గ్రామంలో విషాదం నెలకొంది. అలీపురలోని అనేక కుటుంబాలకు ఇరాన్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నత విద్య ఉపాధి కోసం ఇరాన్లోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ సమయంలో ఇరాన్లో చిక్కుకున్న తమ బంధువుల కోసం గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఖమేనీ మృతిపై సీఎం సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖమేనీ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.