కేరళ అసెంబ్లీలో వందేమాతరం.. రగడ
ABN , Publish Date - May 30 , 2026 | 03:11 AM
కొత్తగా కొలువుతీరిన కేరళ ప్రభుత్వాన్ని వందేమాతరం వివాదం చుట్టుకుంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో జాతీ య గేయం వందేమాతరంలోని కొన్నిచరణాలు మాత్రమే..
గవర్నర్ ప్రసంగ కార్యక్రమంలో ఆ గేయాన్ని కొంతే వినిపించిన వైనం.. గవర్నర్ అభ్యంతరం
తిరువనంతపురం, మే 29: కొత్తగా కొలువుతీరిన కేరళ ప్రభుత్వాన్ని వందేమాతరం వివాదం చుట్టుకుంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో జాతీ య గేయం వందేమాతరంలోని కొన్నిచరణాలు మాత్రమే వినిపించడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని అన్ని చరణాలను వినిపించడాన్ని ప్రొటోకాల్లో భాగం చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం తెలియజేస్తూ లోక్భవన్ ముందస్తుగా పంపిన మార్గదర్శకాలను ప్రభుత్వం పక్కన పెట్టడంతో వివాదం రాజుకుంది. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలను ఆనవాయితీలో భాగంగా గవర్నర్ శుక్రవారం తన ప్రసంగంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వందేమాతరం మొత్తం గేయం కాకుండా, అందులోని ఆరు చరణాలను పోలీస్ బ్యాండ్పై వినిపించారు. ఆ తర్వాతి చరణాలకు బదులుగా బాణీని మాత్రం వినిపించారు. ఈ చర్యను లోక్భవన్ వర్గాలు తప్పుబడుతున్నాయి. అయితే, ప్రభుత్వ చర్యను సీఎం సతీశన్ సమర్థించుకున్నారు.