జడ్జిల నియామకంలో అధికార పార్టీల జోక్యం
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:31 AM
కొలీజియం వ్యవస్థలోనూ, అంతకు ముందు కూడా న్యాయమూర్తుల నియామకం విషయంలో అధికార పార్టీల జోక్యం కనిపిస్తోందని ఒడిశా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ అన్నారు.
ఒడిశా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ మురళీధర్
హైదరాబాద్ సిటీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): కొలీజియం వ్యవస్థలోనూ, అంతకు ముందు కూడా న్యాయమూర్తుల నియామకం విషయంలో అధికార పార్టీల జోక్యం కనిపిస్తోందని ఒడిశా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ అన్నారు. కొన్ని ఘటనలను ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకదానితో మరొకటి ఏకీభవించకపోవడం గత ఐదేళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రధాన మార్పుల్లో ఒకటని పేర్కొన్నారు. ఆరావళి పర్వతాలు, శబరిమల కేసులే అందుకు నిదర్శనమని ఉదహరించారు. జస్టిస్ మురళీధర్ సంపాదకత్వంలో వచ్చిన ‘ఇన్ కంప్లీట్ జస్టిస్? ది సుప్రీంకోర్టు ఎట్ 75’ పుస్తకంపై ఆదివారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో చర్చా గోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధమైన పాలనకాకుండా చట్టాన్ని ఒక ఆయుధంలా ప్రయోగించి పాలించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కొన్ని కేసుల్లో తుది తీర్పులు ముందే నిర్ణయిస్తున్నట్లు అనుమానం కలిగించేలా ఉన్నాయంటూ మణిపూర్, ఆధార్ తదితర కేసులను ఉటంకించారు.