జార్ఖండ్లో క్రాస్ ఓటింగ్లో పరిమళ్ విజయం
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:37 AM
జార్ఖండ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో ఎన్డీయే మద్దతున్న పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. మొత్తం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..
రాజ్యసభ ఎన్నికల్లో నత్వానీకి ఎన్డీయే మద్దతు
రాంచీ, జూన్ 18: జార్ఖండ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో ఎన్డీయే మద్దతున్న పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. మొత్తం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ ఝా పరాజయం పాలయ్యారు. 81 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 24 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ స్థానాన్ని నెగ్గడానికి కావాల్సిన ఓట్లు 28. అంటే కావాల్సిన వాటికన్నా 4 ఓట్లు తక్కువ. సరిపడా ఎమ్మెల్యేల బలం లేకున్నా క్రాస్ ఓటింగ్ జరగడంతో పరిమళ్ నత్వానీ 28 ఓట్లు సాధించి గెలిచారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 56 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లు సాధించి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు కేవలం 20 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో మూడు చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి.