ఇరాన్ నేవీ బృందం ఆఖరి మజిలీ
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:35 AM
గత నెల భారత నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్), మిలాన్-2026కు హాజరైన ఇరాన్ నేవీ బృందం తిరుగు ప్రయాణంలో ....
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గత నెల భారత నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్), మిలాన్-2026కు హాజరైన ఇరాన్ నేవీ బృందం తిరుగు ప్రయాణంలో విషాదం చోటు చేసుకుంది. స్వదేశం చేరకముందే శ్రీలంక తీరంలో బుధవారం జరిగిన దాడిలో దాదాపు 150 మంది గల్లంతయ్యారు. ఇరాన్ నేవీ బృందం ఫిబ్రవరి రెండో వారంలో విశాఖపట్నం వచ్చింది. గత నెల 16, 17 తేదీల్లో విశాఖలోని పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, గ్లాస్ బ్రిడ్జి, కురుసుర సబ్మెరైన్ వంటివి సందర్శించారు. వారికి వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్భరత్లు సాదరంగా ఆహ్వానం పలికి, అన్నీ దగ్గరుండి చూపించారు. వారితో ఫొటోలు దిగారు. ఇరాన్ నేవీ అధికారులు సెల్ఫీలు తీసుకొని చాలా సంబరపడ్డారు. ఆర్కే బీచ్రోడ్డులో 19వ తేదీన నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో పాల్గొని కవాతు చేశారు. ఇరాన్ నేవీ బ్యాండ్ ప్రదర్శన చేసింది. ఐఎ్ఫఆర్, మిలాన్లు ఫిబ్రవరి 25న ముగిశాయి. ఆ తర్వాత వారంతా తిరిగి ఇరాన్కు బయలుదేరారు. విశాఖ నుంచి ఎంతో ఆనందంగా బయలుదేరిన ఆ బృందం శ్రీలంక తీరంలో దాడికి గురికావడంపై ఇక్కడి నేవీ వర్గాలు దిగ్ర్భాంతి వ్యక్తంచేశాయి.