International Kidney Trafficking: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:12 AM
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టును మహారాష్ట్రలోని చంద్రపూర్ పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీకి చెందిన వైద్యుడు రవీందర్ పాల్ సింగ్ను అరెస్టు చేశారు.
ఢిల్లీ వైద్యుడి అరెస్టు.. పరారీలో తమిళనాడు డాక్టర్
కాంబోడియా, చైనాల్లోనూ కిడ్నీ రాకెట్ లింకులు
ఒక్కో కిడ్నీకి రూ.80 లక్షలు.. దాతకు ఇచ్చేది 8 లక్షలే
చంద్రపూర్, జనవరి 1: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టును మహారాష్ట్రలోని చంద్రపూర్ పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీకి చెందిన వైద్యుడు రవీందర్ పాల్ సింగ్ను అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన వైద్యుడు రాజారత్నం గోవిందస్వామి పరారవడంతో అత ని కోసం గాలిస్తున్నారు. కాంబోడియా, చైనా దేశాలకూ ఈ కిడ్నీ రాకెట్ విస్తరించినట్టు పోలీసులు గుర్తించారు. చంద్రపూర్ జిల్లా మింథుర్ గ్రామానికి చెందిన బాధితుడు రోషన్ కులేఫిర్యాదుతో దీనిపై దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రపూర్ పోలీసులతో సిట్ను నియమించింది. రోషన్ కులే అనే రైతు అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు కిడ్నీని కాంబోడియాలో అమ్ముకునేలా ఆయనపై నిందితులు ఒత్తిడి తెచ్చినట్టు దర్యాప్తులో సిట్ గుర్తించింది. మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఈ ముఠా అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించినట్టు గుర్తించామని చంద్రపూర్ ఎస్పీ ఎం.సుదర్శన్ చెప్పారు. తిరుచ్చిలోని స్టార్ కిమ్స్ ఆస్పత్రిలో అనేక కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్టు తెలిపారు. డాక్టర్ రాజారత్నం గోవిం దస్వామి ఈ ఆస్పత్రికి మేనేజింగ్ డైరెక్టర్. కాగా ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50- రూ.80లక్షల వరకు వసూలు చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. డాక్టర్ రవీందర్ తిరుచ్చికి వచ్చి ఆపరేషన్ నిర్వహించినందుకు రూ.10లక్షలు, డాక్టర్ రాజారత్నం చికిత్సతోపాటు తన స్టార్ కిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్కు చేసిన ఏర్పాట్లకు రూ.20 లక్షలు, మధ్యవర్తిగా ఉన్న నకిలీ వైద్యుడు కృష్ణ అలియాస్ రామకృష్ణ సుంచు కిడ్నీ దాతలను గుర్తించి సమన్వయం చేసినందుకు రూ.20 లక్షలు తీసుకుని కిడ్నీ దాతకు రూ.5-8 లక్షల వరకు ఇచ్చేవారు.