హోర్ముజ్ దాటిన భారత చమురు నౌక ‘గ్రీన్ ఆశా’
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:53 AM
వంట గ్యాస్(ఎల్పీజీ) ట్యాంకర్లతో కూడిన భారత్కు చెందిన ‘గ్రీన్ ఆశా’ నౌక పశ్చిమాసియాలోని కీలక హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: వంట గ్యాస్(ఎల్పీజీ) ట్యాంకర్లతో కూడిన భారత్కు చెందిన ‘గ్రీన్ ఆశా’ నౌక పశ్చిమాసియాలోని కీలక హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. ఈ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. భారత్కు చెందిన నౌకలను ఇరాన్ అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 9వ నౌక గ్రీన్ ఆశా సైతం కీలక మార్గంగుండా విజయవంతంగా ప్రయాణించి.. భారత్ దిశగా పయనిస్తోంది. కాగా.. ఇప్పటి వరకు భారత్కు చెందిన శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. వీటిలో బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్ నౌకలు 94 వేల టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తున్నాయి. మరో 2 నౌకలు పైన్ గ్యాస్, జగ్ వసంత్ 92,612 టన్నుల గ్యాస్తో గత నెలలో భారత్కు చేరుకున్నాయి.