రైలు డగ.. డగ.. శబ్దాలు ఉండవిక!
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:38 AM
రైళ్ల క్రాసింగ్ సమయంలో, వంతెనల మీద నుంచి రైళ్లు వెళ్లే సమయంలో వచ్చే డగ..డగ..డగ శబ్దాలను నివారించడానికి, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రైల్వేశాఖ ...
పట్టాల కింద ఇనుము, కాంక్రీట్ దిమ్మెల స్థానంలో ఫైబర్ దిమ్మెలను వాడాలని రైల్వే శాఖ నిర్ణయం
ప్రమాదాల నివారణకు పట్టాలపై ఏఐతో పర్యవేక్షణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: రైళ్ల క్రాసింగ్ సమయంలో, వంతెనల మీద నుంచి రైళ్లు వెళ్లే సమయంలో వచ్చే డగ..డగ..డగ శబ్దాలను నివారించడానికి, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాల కింద ఇప్పటివరకు వాడుతున్న కాంక్రీటు, ఇనుప దిమ్మెలకు బదులుగా ఫైబర్ దిమ్మెల(కాంపోజిట్ స్లీపర్లు)ను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాంపోజిట్ స్లీపర్లు తక్కువ బరువు ఉండటమే కాకుండా చాలా దృఢంగా ఉంటాయి. వీటి వల్ల రైలు కుదుపులు తగ్గిపోయి శబ్దాలు రావు. మరమ్మతులు తేలిగ్గా చేయవచ్చు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. బ్రిడ్జిలు, క్రాసింగ్ల వద్ద ఈ కాంపోజిట్ స్లీపర్ల వినియోగాన్ని పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇదిలా ఉండగా, రైలు పట్టాలపై రాళ్లు పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా వెలుగుచూసిన నేపథ్యంలో రైళ్లలోనే ఏఐ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందుకోసం రైలు ముందు భాగంలో ఏఐ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రైలు పట్టాలపై ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు, పట్టాలు పక్కకు తొలగిపోయినప్పుడు ఈ వ్యవస్థ కొంతదూరం నుంచే పసిగట్టి హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.