విదేశీ డ్రగ్ స్మగ్లర్ల బహిష్కరణ వేగవంతం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:40 AM
మాదకద్రవ్యాల కేసులు నమోదైన విదేశీ డ్రగ్ స్మగ్లర్ల బహిష్కరణను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: మాదకద్రవ్యాల కేసులు నమోదైన విదేశీ డ్రగ్ స్మగ్లర్ల బహిష్కరణను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. చట్టపరమైన జాప్యాల కారణంగా వారు ఎక్కువ కాలం దేశంలో ఉండకుండా నిరోధించాలని, వీలైతే కొన్ని కేసుల్లో ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకొనే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. నామమాత్రపు జరిమానాలు, స్వల్పకాలిక జైలుశిక్షలు విధించే అవకాశం ఉన్న నేరాల్లో నిందితులను సాధ్యమైనంత త్వరగా వారి స్వదేశాలకు తిప్పిపంపాలని హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వార్షిక నివేదిక ప్రకారం.. 2024లో డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా 660 మంది విదేశీయులు అరెస్టయ్యారు. వీరిలో నేపాలీలు 203 మంది, నైజీరియన్లు 106 మంది, మయన్మార్ వాసులు 25 మంది, బంగ్లాదేశ్ పౌరులు 25 మంది ఉన్నారు.