భారత్-పాక్ అనధికార చర్చలతో సంబంధం లేదు
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:20 AM
భారత్, పాకిస్థాన్లకు చెందిన రిటైర్డు అధికారులు, రాజకీయ నాయకులు జరిపే అనధికారిక చర్చలను ప్రభుత్వం పట్టించుకోదని విదేశీ వ్యవహారాల కార్యదర్శి ...
విదేశీ వ్యవహారాల కార్యదర్శి స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూన్ 29: భారత్, పాకిస్థాన్లకు చెందిన రిటైర్డు అధికారులు, రాజకీయ నాయకులు జరిపే అనధికారిక చర్చలను ప్రభుత్వం పట్టించుకోదని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టం చేశారు. అలాంటివాటిని అసలు పరిగణనలోకి తీసుకోదని కూడా తెలిపారు. ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రెండు దేశాలకు చెందిన రిటైర్డు మిలటరీ, దౌత్య అధికారులు, ఇతర ప్రముఖులు ట్రాక్-2 చర్చల పేరిట సంభాషణలు జరిపారంటూ వచ్చిన వార్తలపై మిస్రీ స్పందించారు. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణపై వారు అనధికారికంగా చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సీషెల్స్లోని విక్టోరియాలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ప్రపంచంలో చాలా చోట్ల ప్రయివేటు వ్యక్తులు పలు విషయాలపై ప్రయివేటుగా సమావేశాలు జరుపుతుంటారని అన్నారు.