డ్రగ్స్ స్మగ్లింగ్పై గతేడాది 1.48లక్షల కేసులు
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:21 AM
దేశ యువత డ్రగ్స్ ‘మత్తు’లో చిత్తు కాకుండా, ఆ మహమ్మారి ఉచ్చులో పడకుండా వారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 27: దేశ యువత డ్రగ్స్ ‘మత్తు’లో చిత్తు కాకుండా, ఆ మహమ్మారి ఉచ్చులో పడకుండా వారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశవ్యాప్తంగా 2025లో నమోదైన మాదకద్రవ్యాల కేసుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 53శాతం పెరిగి 1,48,063కి చేరింది. 2024లో కేసుల సంఖ్య 96,930గా ఉంది. మొత్తం కేసుల్లో రాష్ట్రాల పోలీసులు నమోదు చేసినవే 1,40,294(94.8శాతం) ఉండడం గమనార్హం. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక-2025లో వెల్లడించింది. ఇక, 2025లో వివిధ కేసుల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న గంజాయి ఉత్పత్తులు, హెరాయిన్, నల్లమందు వంటి ఓపియేట్స్ సహా మొత్తం డ్రగ్స్ పరిణామం 1,240 టన్నులకు పెరిగింది. వీటి విలువ రూ.18,227 కోట్లు ఉంటుందని అంచనా.