Share News

అవినీతి సూచీలో 91వ స్థానంలో భారత్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:54 AM

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ తాజాగా విడుదల చేసిన అవినీతిమయ దేశాల జాబితాలో.. 2025 సంవత్సరానికిగాను భారత్‌ 91వ స్థానంలో నిలిచింది.

అవినీతి సూచీలో 91వ స్థానంలో భారత్‌

  • నిరుడు 38 స్కోరుతో 96వ స్థానం.. ఈసారి మెరుగు

  • 2025 సూచీ విడుదలచేసిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ తాజాగా విడుదల చేసిన అవినీతిమయ దేశాల జాబితాలో.. 2025 సంవత్సరానికిగాను భారత్‌ 91వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చే సంస్కృతి, ప్రభుత్వ నిధుల మళ్లింపు, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం (నెపోటిజం), అవినీతిని ప్రశ్నించేవారికి, జర్నలిస్టులకు ఎంతవరకూ రక్షణ ఉంది అనే అంశాల ఆధారంగా దేశాలకు 0 (అత్యధిక అవినీతి) నుంచి 100 (అసలు అవినీతి లేని పరిస్థితి) దాకా స్కోరు ఇవ్వడం ద్వారా ఈ జాబితా రూపొందిస్తారు. ఇందులో భారత్‌ 39 స్కోరుతో.. మాల్దీవులు, మొరాకో, ట్యునీషియాతో సమానంగా 91వ స్థానంలో నిలిచింది. కిందటి ఏడాది స్కోరు (38)తో పోలిస్తే 2025లో భారత్‌ స్కోరు ఒక్క పాయింట్‌ మేర మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి సమస్య నానాటికీ పెరిగిపోతోందని.. అవినీతికి సంబంధించి ప్రపంచ దేశాల సగటు స్కోరు దశాబ్దకాలంలోనే అతి తక్కువగా 42కు పడిపోవడం, మూడింట రెండొంతుల దేశాల స్కోరు 50లోపే ఉండడం ఆందోళన కలిగిస్తోందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ తన నివేదికలో పేర్కొంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో.. నానాటికీ పెరుగుతున్న అవినీతిపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు.. పలు దేశాల్లో యువత ఈ అవినీతికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో 89 స్కోరుతో డెన్మార్క్‌ అతి తక్కువ అవనీతి ఉన్న దేశంగా అగ్రస్థానంలో నిలవగా.. ఫిన్‌లాండ్‌ (88), సింగపూర్‌(84),న్యూజిలాండ్‌(81),నార్వే(81)స్వీడన్‌(80), స్విట్జర్లాండ్‌(80), లగ్జెంబర్గ్‌(78), నెదర్లాండ్స్‌(78) జర్మనీ(77) టాప్‌టెన్‌లో ఉన్నాయి.

Updated Date - Feb 11 , 2026 | 01:54 AM