హోర్ముజ్ను దాటిన మరో రెండు నౌకలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:37 AM
యుద్ధం కారణంగా భారత్లో ఇంధన నిల్వలపై ఆందోళన నెలకొంది. అయితే దేశంలో ప్రస్తుతం మూడింట రెండొంతుల ముడి చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపి ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 23: యుద్ధం కారణంగా భారత్లో ఇంధన నిల్వలపై ఆందోళన నెలకొంది. అయితే దేశంలో ప్రస్తుతం మూడింట రెండొంతుల ముడి చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో నిర్మించిన మూడు వ్యూహాత్మక భూగర్భ కేంద్రాల్లోని మొత్తం 53.3 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికిగాను ప్రస్తుతం 33.72 లక్షల టన్నుల ముడి చమురు నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి సురేశ్ గోపి సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 64 శాతంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాదూర్లలో ఈ నిల్వ కేంద్రాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. భారత్కు చెందిన మరో రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే ఎల్పీజీ నౌకలు హోర్ముజ్ను దాటినట్లు, త్వరలోనే ఇవి భారత పోర్టులకు చేరనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, చమురు సంక్షోభం వేళ అర్జెంటీనా భారత్ను బాసటగా నిలుస్తోంది. గత మూడు మాసాల్లో 50 వేల టన్నుల ఎల్పీజీని భారత్కు ఎగుమతి చేసింది. దీంతో సంక్షోభ సమయంలో ఆపన్న హస్తం అందించినట్టయింది.