మరో మిసైల్ ప్రయోగం విజయవంతం.. దేశంలో తొలిసారిగా..
ABN , Publish Date - Apr 29 , 2026 | 09:20 PM
యుద్ధ నౌకలను ధ్వంసం చేసే ఎన్ఏఎస్ఎమ్ ఎస్ఆర్ మిసైల్ను డీఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా సాల్వో లాంచ్ విధానంలో క్షిపణులను ప్రయోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. యుద్ధ నౌకలను టార్గెట్ చేసే నేవల్ యాంటీ-షిప్ మిసైల్ (NASM-SR) ప్రయోగం తాజాగా విజయవంతమైంది. బంగాళాఖాతంలో హెలికాప్టర్ ద్వారా క్షిపణిని డీఆర్డీఓ, భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించాయి. సాల్వో లాంచ్ విధానంలో వరుసగా రెండు మిసైల్స్ను హెలికాఫ్టర్ నుంచి ప్రయోగించాయి. ఈ మిసైల్ను సాల్వో లాంచ్ విధానంలో ప్రయోగించడం దేశంలో ఇదే తొలిసారి.
ఈ పరీక్ష సందర్భంగా మిసైల్ గమనం, దిశను మార్చుకునే సామర్థ్యం వంటివన్నీ అంచనాలను అందుకున్నాయని డీఆర్డీఓ ఎక్స్ వేదికగా తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితత్వంతో మిసైల్ పనిచేసిందని వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నావిగేషన్, గైడెన్స్, సీకర్ వ్యవస్థలు క్షిపణిలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలను, నౌకాదళాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. భారత అమ్ములపొదిలో క్షిపణి చేరికతో నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుందని అన్నారు.