నైపుణ్యాభివృద్ధి మంత్రం
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:01 AM
విద్య, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంపై కేంద్రం దృష్టి సారించింది. విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరమని కీలక నిర్ణయాలు తీసుకుంది...
విద్యా రంగానికి 1,39,285.95 కోట్లు.. గతేడాది కంటే 8.27ు పెరిగిన కేటాయింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: విద్య, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంపై కేంద్రం దృష్టి సారించింది. విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరమని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించందుకు కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించింది. యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఏఐ ఎక్స్లెన్స్ కేంద్రాలు, పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్ల వద్ద యూనివర్సిటీ టౌన్షి్పల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఈ ఏడాది విద్యారంగానికి రూ.1,39,285.95 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే 8.27 శాతం పెంచింది. 2026-27 బడ్జెట్లో విద్యా రంగంపై తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ..
ఆరెంజ్ ఎకానమీపై ఫోకస్
మీడియా, వినోదం, మేదో సంపత్తి వంటి సృజనాత్మక రంగాలను ఆరెంజ్ ఎకానమీగా పేర్కొంటారు. యానిమేషన్, వీఎ్ఫఎక్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ), టూరిజం, వినోదం తదితర రంగాలు ఇందులోకి వస్తాయి. వేగంగా వృద్ధి చెందుతున్న ఏవీజీసీ రంగంలో 2030 నాటికి 20లక్షల మంది నిపుణులు అవసరమని కేంద్రం అంచనా వేసింది. ఈ డిమాండ్ను అందుకునేందుకు ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ నేతృత్వంలో 15,000 ప్రాథమికోన్నత పాఠశాలలు, 500 కళాశాలలో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటును ప్రతిపాదించింది. స్టార్ట్పలను ప్రోత్సహించడం, కొత్త కంటెంట్ క్రియేటర్లను తయారు చేయడం, డిజిటల్ క్రియేటివ్ రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడం వీటి లక్ష్యం. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఐదు ‘నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఏఐ’ కేంద్రాల ఏర్పాటును కేంద్రం ప్రతిపాదించింది.
పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్ల సమీపంలో రాష్ట్రాల సహకారంతో ఐదు యూనివర్సిటీ టౌన్షి్పల అభివృద్ధిని ప్రతిపాదించింది. దేశంలోని 20,000 పర్యాటక ప్రాంతాల్లో పని చేసేందుకు వీలుగా ఐఐఎంల ద్వారా 10,000 మంది టూరిస్టు గైడ్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీగా అప్గ్రేడ్ చేయనున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం రంగాల్లో ఉన్నత విద్య అందించే స్టెమ్(ఎ్సటీఈఎం) ఇన్స్టిట్యూషన్స్లో పరిశోధనలు, అధ్యయనాలు చేసే క్రమంలో విద్యార్థినులు ఇబ్బందులను గుర్తించిన కేంద్రం జిల్లాకో బాలికల వసతి గృహం ఏర్పాటును ప్రతిపాదించింది. ఖగోళ భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్ర రంగాలను ప్రోత్సహించేందుకు నాలుగు టెలీస్కోపిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది.
ఆయుర్వేద వైద్య రంగం బలోపేతానికి ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద పేరిట 3 విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. పశు వైద్య నిపుణుల సంఖ్యను 20,000కు చేర్చడమే లక్ష్యంగా కొత్త వెటర్నరీ, పారా వెటర్నరీ కళాశాలల ఏర్పాటును ప్రతిపాదించారు. దేశాన్ని బయోఫార్మాసూటికల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్తగా 3 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఈసారి కొత్త ఐఐటీలు, ఐఎంఎంలపై ప్రకటన లేదు. 2014 తర్వాత ఏర్పాటైన 5 ఐఐటీల్లో మౌలిక వసతుల కల్పన, విస్తరణ చేపట్టనున్నారు.
మన విద్యార్థులకు ఉపశమనం
హైదరాబాద్ సిటి: చదువు కోసం విదేశాలకు పంపే సొమ్ముపై టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు)ను 2 శాతానికి తగ్గించడంతో.. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నవారికి ప్రయోజనం కలిగించనుంది. గత ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి 1,62,500 మంది చదువు కోసం విదేశాలకు వెళ్లారు. ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నవారు ఐదారు లక్షల మందికిపైనే ఉంటారు. వారందరికీ ప్రయోజనం ఉంటుందని ఒక కన్సల్టెన్సీ ప్రతినిధి సూరజ్ చెప్పారు. విదేశీ చదువు కోసం అప్పులు చేసో, ఆస్తులు విక్రయించో సమకూర్చుకున్న డబ్బులో 5శాతాన్ని టీసీఎస్ కింద చెల్లించి.. తర్వాత ఐటీ రిటర్నులు దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని సీఏ హరికృష్ణ తెలిపారు. ఇప్పుడు టీసీఎ్సను 2 శాతానికి తగ్గించడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెప్పారు.